Nov 14, 2020

*DA అన్నది కానుక కాదు.... నిజ వేతనాలు పడిపోకుండా చేసే పరిహారం* సైన్యంతో సహా 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 61 లక్షల మంది పింఛనుదారులకు కరువు భత్యం (డి.ఎ) స్తంభింపచేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం ఏప్రిల్‌ 23న మెమోరాండం (నెం.1/1/2020-ఇ- 11(బి)) జారీ చేసింది. దీనిని ఉటంకిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులు, పింఛనర్ల డి.ఎ ను నిలిపివేస్తూ ఈ నెల 6వ తేదీన జీఓ నెం.95 విడుదల చేసింది. జనవరి 2020 నుండి జూన్‌ 2021 వరకు పెరిగిన డి.ఎ ఇవ్వకుండా నిలిపివేస్తామని అందులో వెల్లడించారు. పెరిగిన డి.ఎ బకాయిలు కూడా చెల్లించబోమని పేర్కొన్నారు. *దీనర్ధం ఏమిటంటే ఈ 18 నెలల కాలానికి పెరిగిన డి.ఎ బకాయిలను ఇక శాశ్వతంగా కోల్పోవలసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో దీని ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.లక్ష 20 వేల కోట్ల ఆదాయం మిగులుతుందని ప్రభుత్వ అంచనా. జూలై 2021 నుండి మాత్రమే పెరిగిన డి.ఎ ఇవ్వబడుతుంది.* ఇది స్వతంత్ర భారత దేశంలో ఒక అసాధారణ నిర్ణయమే. ఎమర్జన్సీ కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం కొంత కాలం వేతన స్తంభన విధించడం తప్ప...గతంలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా మహమ్మారి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయిందని, ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయిందని, ఖర్చులు కూడా భారీగా పెరిగాయని... అందువల్లనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది. ఈ వాదనలు కొంతమందికి సహేతుకంగా ఉన్నట్లు కనిపించినా, కొద్దిగా లోతుగా పరిశీలిస్తే, ఇందులో ఉన్న డొల్లతనం బయటపడుతుంది. పైగా, దీనివల్ల ప్రభుత్వం పేర్కొన్న సమస్యలు పరిష్కారం కాకపోవడమేగాక మరింత పెరిగే ప్రమాదం వుందని తెలుస్తుంది. *డి.ఎ అన్నది ప్రభుత్వం ఎప్పుడూ ఆర్భాటంగా ప్రకటించే కానుక ఏమాత్రం కాదు. దానికి భిన్నంగా పెరిగిన ధరలకు అనుగుణంగా నిజ వేతనాలు పడిపోకుండా చేసే పరిహారం మాత్రమే. ఉదాహరణకు ఈ రోజు కిలో బియ్యం రూ.40 అనుకుందాం. ఒక సంవత్సరం తరువాత అదే బియ్యం ధర రూ.44 అయిందనుకుంటే, అప్పుడు ధర పది శాతం పెరిగింది. అంటే, కిలో బియ్యం కొనుక్కోవడానికి ఇప్పటి కంటే సంవత్సరం తరువాత 10 శాతం ఎక్కువ ఖర్చు పెట్టాలన్నమాట. దీనర్ధం జీతం పెరగకపోతే, కార్మికుడి నిజ వేతనం 10 శాతం తగ్గిపోతుందన్నమాట. ఇప్పుడు రూ.100 వున్న జీతం కాస్తా, రూ.90 కు నిజ వేతనం పడిపోతుందని అర్ధం. దీనిని భర్తీ చేయకపోతే, కార్మికుని వేతనాలు తగ్గిపోవడమే అవుతుంది. అలా తగ్గకుండా, నిజ వేతనాన్ని నిలుపుదల చేయడానికి ఏర్పాటు చేసిందే డి.ఎ. ఈ డి.ఎ పెరిగినప్పుడల్లా ఉద్యోగులకు జీతం పెంచేస్తున్నట్లు, ప్రభుత్వం మీద కోట్ల రూపాయల భారం పడిపోతున్నట్లు, ఉద్యోగులకు పండగ కానుక ఇచ్చేస్తున్నట్లు ప్రభుత్వం గొప్ప ప్రకటనలిస్తూ ఉంటుంది. *కొంత మంది ఉద్యోగులు కూడా జీతం పెరిగిపోయినట్లు భావిస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా నిజ వేతనంలో మార్పేమీ ఉండదు.* ఈ నిజ వేతనాన్ని కాపాడుకోవడానికి భారత కార్మికవర్గం బ్రిటిష్‌ కాలంలో పెద్ద పోరాటమే చేసింది. 1939-45 మధ్య కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం, దేశంలో నెలకొన్న కరువు వల్ల ధరలు ఆకాశాన్నంటాయి. అప్పటి వరకు కార్మికుల వేతనం అంటే కేవలం మూల వేతనం మాత్రమే. ఇప్పటి 'బేసిక్‌ పే' లాగా. కార్మికులు పోరాడితే, మహా అయితే నాలుగైదేళ్ళకు ఓసారి మూల వేతనం మాత్రమే పెరిగేది. ఈ కాలం లోని ధరల పెరుగుదలను భర్తీ చేసేదిగా ఎటువంటి ఏర్పాటు ఉండేది కాదు. దీనివల్ల 1939లో రూ.100 వున్న కార్మికుని నిజ వేతనం...ధరల పెరుగుదల వల్ల రూ. 74.9కు పడిపోయింది. ఇలాంటి సమయంలో నిజ వేతనంలో ఏర్పడ్డ లోటును భర్తీ చేయాలని ముంబాయి లోని లక్ష 75 వేల మంది జౌళి పరిశ్రమ కార్మికులు 1940 మార్చి 5న సమ్మె చేశారు. ఆ తరువాత ఈ పెంపుదల డిమాండు సర్వవ్యాపితం అయింది. దేశంలో అనేక పోరాటాలు జరిగాయి. ఫలితంగా కార్మికవర్గం మొట్టమొదటిసారి కరువు భత్యం (డి.ఎ) సాధించుకుంది. వాస్తవంగా దేశంలో కరువు పోయి, ధరలు పెరగకపోతే, కరువు భత్యం పెంచవలసిన అవసరమే లేదు. కానీ విచిత్రంగా మన దేశంలో నిత్యం ధరల పెరుగుదల, కరువు సాధారణం అయ్యాయి. ధరల పెరుగుదలను అరికట్టలేని ప్రభుత్వం నిజ వేతనాన్ని భర్తీ చేసే కరువు భత్యాన్ని మాత్రం ఎగ్గొట్టడం ప్రభుత్వ చేతకానితనం తప్ప మరొకటి కాదు. ఆఖరుకు బ్రిటిష్‌ కాలంలో కార్మికులు పొరాడి సాధించుకున్న కరువు భత్యానికి కూడా ఎసరు పెట్టడం నిస్సందేహంగా దివాళాకోరుతనమే. ప్రభుత్వం ఇలా డి.ఎ ఎగ్గొట్టడమే కాకుండా, దీనికి మించి, ధరల పెరుగుదలను కొలిచే వినిమయ ధరల సూచీని (కంజ్యూమర్‌ ప్రైజ్‌ ఇండెక్స్‌) లెక్కించే పద్ధతిని, కొలిచే సూత్రాన్ని మార్చడం ద్వారా కూడా మోసం చేస్తోంది. ఇక్కడ గమనంలో తీసుకోవలసిన మరో రెండు అంశాలున్నాయి. ఒకటి ధరలు పెరిగినప్పుడల్లా ఇలా డి.ఎ పెరగడం కేవలం ఏడు శాతం లోపు కార్మికులకే అమలవుతోంది. దేశంలో సింహ భాగంగా ఉన్న మిగిలిన 93 శాతం మంది కార్మికులకు నిజ వేతనంలో డి.ఎ రూపంలో ఎటువంటి భర్తీ లేదు. వారికి కూడా డి.ఎ ఇవ్వాలని కార్మికవర్గం ఒక పక్క పోరాడుతుంటే, ప్రభుత్వం ఉన్న డి.ఎ కే ఎగనామం పెట్టడం భరించరాని చర్యే. రెండోది, పోనీ డి.ఎ ఆపడం వల్ల ఆర్థిక వ్యవస్థ ఏమైనా మెరుగుపడుతుందా అంటే అది కూడా జరగదు. ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే, మార్కెట్లో సరుకులు అమ్ముడు పోవాలి. ఆ సరుకులు కొనుక్కునే ప్రజల ఆదాయాలు పెరగాలి. కాని ప్రభుత్వ చర్య వల్ల ఉద్యోగుల నిజ ఆదాయాలు తగ్గి పోతాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన జనవరి 2020 నుండి పెరగవలసిన నాలుగు శాతం డి.ఎ ను చెల్లించకుండా ఆపేసింది. జులై 2020, జనవరి 2021 లలో పెరగబోయే డి.ఎ లను కూడా చెల్లించదు. కొంతమంది వేస్తున్న అంచనా ప్రకారం ధరల పెరుగుదల ఇలాగే ఉంటే ఈ కాలంలో కనీసం 18 నుండి 20 శాతం వరకు డి.ఎ ను ఉద్యోగులు, పెన్షనర్లు కోల్పోయే అవకాశం ఉంది. ఆ మేరకు వీరి కొనుగోలుశక్తి తగ్గి, తప్పకుండా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావమే పడుతుంది. అందువల్ల ఏ రకంగా చూసినా ప్రభుత్వం తన చర్యను సమర్ధించుకోవడానికి చేసే వాదనలలో పస లేదు. నిజంగా ప్రభుత్వానికి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఉద్దేశం ఉంటే కనుక ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవడమే కాక, కార్మికులందరికి ఈ కష్ట కాలంలో డి.ఎ ను వర్తింపచేసి కొనుగోలు శక్తి పెంచాలి. ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇప్పటికే ప్రొ|| ప్రభాత్‌ పట్నాయక్‌, జయతీ ఘోష్‌ వంటి అనేక మంది ఆర్థికవేత్తలు సూచించినట్లుగా సంపన్నులపై వారసత్వ పన్ను, సంపద పన్ను విధించడం వంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. వీటిని వదిలేసి ఉద్యోగులపై పడడం ఏ మాత్రం సమంజసం కాదు. దేశానికి అంతకంటే శ్రేయస్కరం కాదు. మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక హక్కులపై దాడి చేయడమే నేడు పనిగా పెట్టుకుంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే బాట పట్టాయి. అందులో భాగమే కార్మిక చట్టాల సవరణ, డి.ఎ స్తంభన వంటివి. ఆఖరుకు మోడీ నిత్యం జపం చేసే సైన్యాన్ని కూడా ఈ దాడి నుండి వదలకపోవడం ప్రభుత్వ కపటత్వానికి నిదర్శనం. ఇప్పుడు దీనిని ప్రతిఘటించకపోతే మరలా ఇస్తారని గ్యారంటీ ఏమీ లేదు. రేపు వేతన సవరణలకు కూడా ఎగనామం పెట్టరని గ్యారంటీ అంతకంటే లేదు. అందువల్ల ఉద్యోగులు, సంఘాలు వివేకంతో పోరాడి ఈ దాడిని నిలువరించడమే ఏకైక మార్గం.